||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది ఒకటవ సర్గ ||

||వైదేహ్యా వ్యాజహార హ!||


||ఓమ్ తత్ సత్||


సుందరకాండ.
అథ ఏకత్రింశస్సర్గః

తత్త్వదీపిక
"వైదేహ్యా వ్యాజహార హ!"

ఈ సర్గ "సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ !" అనే మాటతో మొదలవుతుంది.
ఇక్కడ "హ" అంటే "అహా!" అన్నట్లు.
అది ఆనందాశ్చర్యములతో పలికే మాట.
ఏమిటామాట అని చూద్దాము.

అది "మధురం వాక్యం".
ఆ మధురమైన వాక్యములతో చెప్పబడినది రామకథ.
ఆ రామకథ ఆ మహకపి వినిపించాడుట. ఎవరికి?
"వైదేహ్యా" అంటే విదేహ మహరాజు కూతురికి అని అర్థము.
ఇంకో అర్థము దేహముతో సంబంధములేని ఆ సీతమ్మకి అని.

ఇరువది ఎనిమిదవ సర్గలో వింటాము,
"శీఘ్రం గమిష్యామి యమస్య మూలం",
అంటే యముడి దగ్గరకు పోవడానికి సిద్దముగా వున్నాను అంటుంది సీత
అంటే అలాంటి స్థితిలో వున్నసీతమ్మకి ప్రాణముపోసినది ఈ రామకథ.
దేహమునందు నిస్పృహకలిగి,
దేహము తనది కాదని వదిలిన సీతమ్మకు,
మరల మమత పెంచినదీ రామకథ.

సుఖదుఃఖాలు మనో ప్రేరణతో వస్తాయి.
కాని ఈ రామకథ వినినంతట మాత్రముననే,
మనస్సుతో సంబంధము లేకుండా ఆనందము కలిగిస్తుంది అంటారు అప్పలా చార్యులవారు.

సహజముగా కథ అంతయూ విన్న తరువాత ,
పూర్వాపర నిరూపణము చేసిన తరువాత,
లోకములో కథలు ఆనందమును కలిగిస్తాయి.
కాని రామకథ చెవిలో పడినంత మాత్రముననే ఆనందము కలిగించును.

సీతమ్మ మనసు ఇంద్రియములతో కలిసివుండలేదు.
మనస్సు ఇంద్రియములద్వారా ప్రసరించి,
శబ్దమును కలిగించినప్పుడే పొందవలసిన ఆనందము,
రామ కథ వినినంతమాత్రమున నే కలిగించును.

అందుకనే "మృతసంజీవనం రామ చరితం" అంటారు పూర్వీకులు.

పదహారవ సర్గలో "నైషా పశ్యతి రాక్షస్యః.. "(16.25) అంటూ సీతని వర్ణిస్తాడు కవి.
సీత మనస్సంతా రాముది మీదే వుందిట.
సీతకి రాక్షసులు కనపడట లేదుట,
సీతకి పుష్పములు ఫలములు కనపడట లేదుట.
ఎందుకు ? సీత మనస్సంతా రాముడి మీదే వుండడము వలన.
అలాంటి సీతకు వినపడేట్టుగా హనుమంతుడు "వ్యాజహార", అంటే రామకథ పలికెను.

వ్యాజహర అనే పదములో " అజహార" అనే క్రియా పదము కూడా వుంది.
"అజహార" అంటే తెచ్చెను. ఏమిటి తెచ్చెను?.
శరీర భావము వదిలేసిన సీతకు శరీరభావము తెచ్చెను అని ఇంకో అర్థము.

రామకథలోని గొప్పతనము
శరీరమును నిలుపును.
చెవికి ఇంపగును.
శరీరభావములేని సీతకు (ఆత్మకు) ఆనందము కలిగించును.

ఇట్టి విచిత్రమగు శక్తికల రామకథను పలుకుచున్నాడని ముగ్ధుడై వాల్మీకి "హ" అంటాడు .

ఆలాగ హనుమంతుడి చే చెప్పబడిన రామ కథ మనకి తెలిసినదే అయినా వినతగినది.

ఆ మహాకపి అనేక విధములుగా ఆలోచించి
వైదేహికి మధురమైన మాటలు వినిపించుట్లు చెప్పుతాడు.
ఆ రామకథ విందాము.

" దశరథుడు అను పేరుగల రాజు
అనేకమైన రథములు ఏనుగులు కలవాడు,
పుణ్యశీలుడు, మహాకీర్తిగలవాడు
ఇక్ష్వాకులలో మహత్తరమైన యశస్సు కలవాడు.
రాజర్షి, శ్రేష్ఠ మైన గుణములు కలవాడు,
తపస్సులో ఋషులతో సమానమైన వాడు.
బలములోఇంద్రునితో సమానుడు.
చక్రవర్తుల కులములో జన్మించినవాడు.
ఆ మహారాజు అహింసలో అనురక్తి గలవాడు.
ఉదారుడు క్షుద్రుడు కాడు, దయకలవాడు,
సత్యమనే ఆయుధముకల పరాక్రముడు.
ఇక్ష్వాకువంశములోముఖ్యుడు.
లక్ష్మికలవాడు.
లక్ష్మిని పెంపొందింప కలవాడు.
రాజలక్షణములు కలవాడు,
ఐశ్వర్యము కలవాడు.
రాజులలో రాజు.
నాలుగు సముద్రములతో చుట్టబడిన భూమండలము లో పేరుగలవాడు.
సుఖములను కలగించువాడు.
తాను సుఖముగా నుండువాడు".

"ఆయన యొక్క ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు రాముడు.
అతడు చంద్రుని ముఖమువంటి ముఖము కలవాడు.
విశేషజ్ఞానము కలవాడు.
ధనస్సు ధరించువారిలో శ్రేష్ఠుడు.
శతృవులను తపింపచేయు వాడు.
స్వధర్మమును పాటించువాడు.
స్వజనములను రక్షించువాడు.
జీవలోకమును ధర్మమును రక్షించువాడు."

ఇక్కడ హనుమంతు ని ద్వారా ఒక శ్లోకము వింటాము.

"రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షితా
రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః"(31.7)

రాముడు తన స్వధర్మమును రక్షించుకొనును.
తనవారిని రక్షించుకొనువాడు,
జీవలోకమును రక్షించువాడు,
ధర్మమును రక్షించువాడు.

ఇదే శ్లోకము బాలకాండలో ప్రథమసర్గ అంటే సంక్షేపరామాయణములో వస్తుంది.

రాముని ప్రధానలక్షణము రక్షకత్వము.
రాముడు భగవదవతారము.
భగవదవతారమునకు ప్రధాన ప్రయోజనము సాధు రక్షణము, ధర్మరక్షణము.
"యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా " అన్న మాటలో కూడా అదే అర్థము.

రాజుగా రాముడు రక్షకుడు.
అట్లు రక్షించుటలో తన ధర్మమును రాజు రక్షించుకోవలెను.
అందుకే ముందుగా తనధర్మమును రక్షించుకొనువాడని చెప్పబడినది.

రెండవది స్వజనమును రక్షించుట.
తనదేశములో ప్రజలని రక్షింపనివాడు , వారి అనురాగము కోల్పోయి తన రాజత్వమునే కోల్పోవును.
రక్షణమనగా ఆపదలను తొలగించుట. అభిమతమును సమకూర్చుట. ఇది రాజు చేయవలసిన ధర్మము.

మూడవది జీవలోక రక్షణము.
రాజు సర్వభూతహితుడై ప్రవర్తించవలయును.
తనవారను కాపాడుతూ ఇతరుల నాశనముకు యత్నింపరాదు.
ప్రజలనే కాక సమస్త జీవకోటికి బాధ్యుడు.

నాలుగవది ధర్మ రక్షణము.
ప్రజలు వారి వారి ధర్మములను అనుసరించునట్లు చూచుట రాజు ధర్మము.

ఇట్లు చతుర్విధములుగా రక్షణమును సాగించు వాడు రాముడు.
పరమాత్మగా రాముడు రక్షకుడు.
పరమాత్మకు ప్రధాన లక్షణము రక్షణమే.
'అ'కారము పరమాత్మకు పేరు.
"అవరక్షణే" అనే మాటలో మనకి తెలిసేది , అకారము రక్షణకే
'అ' అనే అక్షరము అన్ని అక్షరములకు ముందున్న అక్షరము.
సర్వ వాఙ్మయమునకు అది మూలము.
సర్వ పదార్థములకు పరమాత్మయే మూలము.
అందుచే 'అ'కారమునకు అర్థము పరమాత్మ.

సర్వజగత్తుకు కారణమైనవాడు,
సర్వజగత్తు రక్షకుడైనవాడు ఆ 'అ'కారముచే తెలియచేయబడును.
ఈ శ్లోకములో పరమాత్మగా రక్షకుడైన రాముని స్వభావము తెలియచేయబడినది.

రామకథ చెప్పే హనుమంతుడు ,
సీత కి వినపడేలా రాముని గురించి ఇలా చెపుతూ,
రక్షకుడు అనే మాటతో రాముడు జగద్రక్షకుడు,
నీవు ఈ దుఃఖ సముద్రమునుంచి రక్షింపబడతావు అని స్ఫురించేట్లుగా అంటాడు.

హనుమ రామకథా ఇంకా ఇలా చెపుతాడు.

" ఆ సత్యసంధుడు తన యొక్క వృద్ధుడగు తండ్రి మాటలను అనుసరించి
భార్యతో తమ్మునితో కలిసి వనమునకు పోయెను".

" అక్కడ మహారణ్యములో మృగములను వేటాడుతూ
అనేకమంది కామరూపులు శూరులు అగు రాక్షసులు ఆయన చేత సంహరింపబడిరి.
అక్కడ జనస్థానములో జరిగిన రాక్షసుల వధ,
ఖరదూషణుల మరణము విని ,
మాయా మృగరూపములో రాముని వంచించిన రావణుని చేత, సీత అపహరింపబడెను".

" ఆ రాముడు దోషరహితమైన సీతను అన్వేషిస్తూ
మార్గములో సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రుడుగా పొందెను.
అప్పుడు శతృవుల నగరములను జయించగల మహాబలవంతుడగు రాముడు,
వాలిని హతమార్చి, ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను.
సుగ్రీవునిచే పంప బడిన వేలకొలదీ తముకోరిన రూపము దాల్చగల వానరులు
సీతను అన్వేషించుటకై అన్ని దిశలలోను పంపబడిరి".

" ఆ విశాలాక్షి కారణముగా సంపాతి వచనములపై
నేను వందయోజనములు విస్తీర్ణమైన సాగరమును దాటితిని.
నేను రాఘవునిచే చెప్పబడిన రూపము వర్ణము
లక్షణములు వర్చస్సు లను ఈమె లో చూచుచున్నాను".

హనుమంతుడు ఈ విధముగా చెప్పి విరమిస్తాడు.

ఇక్కడ ముందు సీతకు తెలిసిన రామకథ చెప్పి సీతకు నమ్మకము కలిగిస్తాడు.
ఆ తరువాత ఆమెకి తెలియని రామసుగ్రీవ మైత్రిని,
సీతాన్వేషణమును ,
సాగర లంఘనము గురించి వివరిస్తాడు.

ఆ మాటలను విని జానకికి అత్యంత ఆశ్చర్యము కలిగెను.

సీత వానరుని మాటలను విని అన్ని దిశలలో చూచి
రామునినే ధ్యానిస్తూ ఆనంద భరితురాలయ్యెను.

ఆమె పైకి క్రిందకీ అన్నివైపులా చూచి అచిన్త్య బుద్ధికల పింగాధిపతి మంత్రీ,
ఉదయభానుని వలె నున్న హనుమంతుని చూచెను.

ఇదే వానర శ్రేష్ఠుడు వైదేహికి వినిపించినకథ.
అదే మనకు ముప్పది ఒకటవ సర్గలో వినపడే కథ.

||ఓం తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||